సాధువుల హత్య కేసులో 110 మంది అరెస్ట్
By సుభాష్ Published on 21 April 2020 10:11 AM IST
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పాలిఘర్లో ఈనెల 16న ఇద్దరు సాధువులు వారి గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వాహనంలో వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి సాధువులతో పాటు కారు డ్రైవర్ను హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. మత విద్వేషాలతోనే సాధువులను హత్య చేశారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ ఘటనకు సంబంధించిన 110 మందిని పాల్ఘర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 9 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం. వారిని జువెనైల్ హోమ్కు తరలించారు. ఇక నిందితులను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పోలీసు కష్టడిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్లు నాకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనలో హిందు, ముస్లిం వివాదం లేదని స్పష్టం చేశారు. దొంగలంటూ పుకార్లు రావడంతోనే సాధువులపై దాడి జరిగిందని, ఈ ఘటనపై రాజకీయం చేయవద్దని అన్నారు. ఈ విషయంలో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఉద్దవ్ తెలిపారు.
బీజేపీ నేతల ఆగ్రహం
మరో వైపు ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టి దోషులను కఠినగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఈ మూక దాడిలో మృతి చెందిన సాధువుల్లో ఒకరి వయసు 70 సంవత్సరాలు కాగా, మరో సాధువు వయసు 35 ఏళ్లు. కారు డ్రైవర్ వయసు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.