శబరిమల ఆలయం మూసివేత.. ఎందుకంటే..?
By న్యూస్మీటర్ తెలుగు
దేశంలో ప్రస్తుతం అయ్యప్ప భక్తుల శరణుఘోషతో ఆలయాలు మారుమోగుతున్నాయి. అక్టోబరు నెల నుంచి మాలాధారణ చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కాగా, కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని మండలమకరవిళక్కు సందర్భంగా నవంబర్ 17న తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తిపోతోంది. కాగా.. డిసెంబర్ 26 న ఏర్పడే సూర్య గ్రహాణం సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని 4 గంటల పాటు మూసి వేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు పేర్కొంది. డిసెంబర్ 26 గురువారం ఉదయం గం.7-30 నిమిషాల నుంచి గం.11-30 నిమిషాల వరకు ఆలయాన్ని మూసి ఉంచుతారు. డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఉదయం గం.08.06లకు ప్రారంభమై గం.11.30 నిమిషాలకు ముగుస్తుంది.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామినిర్వహించే పలు అభిషేకాలు నిలిపివేయనున్నారు. గ్రహణం అనంతరం ఆలయాన్ని తెరిచి పుణ్యవహాచనాన్ని చేసిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. కొండపైన అయ్యప్ప ఆలయంతో పాటు.. మాలికాపురం, పంబలో ఉన్న ఇతర ఆలయాల్ని కూడా సూర్యగ్రహణం కారణంగా మూసివేయనున్నన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.