సుప్రీంకోర్టు 47వ చీఫ్‌ జస్టిస్‌గా ఎస్‌.ఏ బోబ్డే ప్రమాణస్వీకారం..

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Nov 2019 10:59 AM IST

సుప్రీంకోర్టు 47వ చీఫ్‌ జస్టిస్‌గా ఎస్‌.ఏ బోబ్డే ప్రమాణస్వీకారం..

ముఖ్యాంశాలు

  • జస్టిస్‌ బోబ్డేతో ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి కోవింద్‌
  • 2021 ఏప్రిల్‌ 23 వరకు పదవిలో కొనసాగున్న బోబ్డే
  • 2013లో ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన బోబ్డే

ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరత్‌ అరవింద్‌ బోబ్డే ప్రమాణం స్వీకారం చేయించారు. జస్టిస్‌ బోబ్డేతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బోబ్డే బాధ్యతలు స్వీకరించారు. 2021 ఏప్రిల్‌ 23 వరకు జస్టిస్‌ బోబ్డే పదవిలో కొనసాగనున్నారు. బోబ్డే ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, అమిత్‌ షా హాజరయ్యారు. జస్టిస్‌ రంజన్‌ గోగొయ్‌ ఇటీవలే పదవీ విరమణ చేశారు. దీంతో రంజన్‌ గోగొయ్‌ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనంలోని రెండవ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ బోబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు.

1956 ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎస్‌.ఏ బోబ్డే జన్మించారు. బీఏ, ఎల్‌ఎల్‌ఎం ఉన్నత విద్యాను అభ్యసించిన బోబ్డే 1978లో మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు రాయించుకున్నారు. అనంతరం బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌లో సుమారు 21 ఏళ్లు న్యాయవాదిగా పని చేశారు. బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పని చేసిన బోబ్డే.. 2012 అక్టోబర్‌ 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2013లో ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎస్‌.ఏ బోబ్డే పదోన్నతి పొందారు.

Next Story