టీమిండియాకు షాక్.. రెండో వన్డేకు రిషబ్ పంత్ దూరం
By Newsmeter.Network Published on 16 Jan 2020 8:02 PM IST
టీమిండియా కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేల్లో ఘోర ఓటమితో సతమతమవుతున్న టీమిండియాకు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రూపంలో మరో దెబ్బతగిలింది. వాంఖడే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో కాంకషన్ (తల అదరడం) కారణంగా వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదట. దీంతో రాజ్కోట్ వేదికగా శుక్రవారం జరిగే రెండో వన్డే నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ ఆఖరి వన్డేలో ఆడటంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని ఫుల్ చేసేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెనక్కి వెళ్లి అతడి హెల్మెట్ని బలంగా తాకి అనంతరం పాయింట్ దిశగా గాల్లోకి లేచింది. దీంతో ఫీల్డర్ టర్నర్ క్యాచ్ అందుకోగా పంత్ ఔటైయ్యాడు. బంతి వేగంగా వెళ్లి హెల్మెట్ని తాకడంతో అతడి తల అదిరిందని గుర్తించిన వైద్యులు కొన్ని గంటలు పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. మ్యాచ్లో కీపింగ్ బాధ్యతల్ని కేఎల్ రాహుల్ చూసుకోగా కాంకషన్ సబ్స్టిట్యూట్గా మనీశ్ పాండే మైదానంలోకి వచ్చాడు.
వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం రెండో/ ప్రత్యమ్నాయ వికెట్ కీపర్ని భారత సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇన్నాళ్లు టీమ్లో పంత్కి సపోర్ట్గా సంజు శాంసన్ని ఎంపిక చేస్తూ వచ్చారు. అతను భారత్-ఎ జట్టు తరఫున ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లిపోవడంతో పంత్ ఒక్కడే అయిపోయాడు. దీంతో అనూహ్యంగా కేఎల్ రాహుల్ చేతికి కీపింగ్ గ్లోవ్స్ వచ్చాయి.
మూడు వన్డేల సిరీస్లో ప్రస్తుతం టీమిండియా 0-1తో వెనకబడి ఉంది. దీంతో సిరీస్ ఆశలు నిలవాలంటే రాజ్కోట్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరిగే రెండో వన్డేలో తప్పక గెలవాలి. రిషబ్ పంత్ స్థానంలో మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.