సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ
By Newsmeter.Network Published on 20 Feb 2020 9:56 AM GMTతెలుగు తేజం పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఆమె పేరిట తమిళనాలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు అడుగు పడింది. చెన్నైలోని కోలపాక్కంలో ఒమెగా ఇంటర్నేషనల్ స్కూల్లో హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అకాడమీతో పాటు స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. తాజాగా జరిగిన అకాడమీ శంకుస్థాపన కార్యక్రమానికి సింధు హాజరైంది.
ధ్యానంతో తన ఆటతీరు ఎంతో మెరుగైందని, మానసికంగా ఎంతో దృఢంగా మారానని సింధు పేర్కొంది. తన పేరిట స్టేడియాన్ని నెలకొల్పడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. ఈ అకాడమీ ద్వారా దేశంలో బ్యాడ్మింటన్కు గొప్ప ఊతం లభించనుందని, షటర్లకు కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలను ఇక్కడ నిర్వహించే అవకాశం ఉందని సింధు తెలిపింది.
ధ్యానంతో సింధు రాణించడం చూసిన తర్వాత తాము బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పాలని భావించినట్లు హార్ట్ఫుల్నెస్ ఇన్సిట్యూట్ అనే సంస్థ మార్గనిర్దేశకుడు కమ్లేష్ పటేట్ తెలిపారు. తాజా అకడమీతో తమిళనాడు వ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడ మరింతగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. మొత్తం 12 కోర్టులతో పాటు వెయ్యిమంది కూర్చుని చూసేలా స్టేడియాన్ని తీర్చిదిద్దుతామన్నారు.