గుడిలో కీచక పూజారి భక్తురాలిపై అఘాయిత్యం

By Newsmeter.Network  Published on  27 Nov 2019 5:17 AM GMT
గుడిలో కీచక పూజారి భక్తురాలిపై అఘాయిత్యం

ఈ రోజుల్లో మహిళలు బయటకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మహిళలపై ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా...ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యన ఆలయాల్లో కూడా పూజారులు కీచకులుగా మారుతున్నారు. భగవంతుడికి భక్తులకు మధ్యవర్తి ఎవరంటే పూజారి అని చెబుతుంటాము. మనం ఏ పూజలు చేయాలన్ని ఆలయంలో పూజారి తప్పని సరి. మనం గుడికి వెళ్లి పూజలు నిర్వహించాలంటే ముందుగా పూజారికే ప్రాధాన్యత ఇస్తుంటాము. ప్రతి నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ ఆయన్నే స్మరిస్తూ ఉండే అర్చకుడు కీచకుడి అవతారమెత్తాడు. దైవ సన్నిధిలోనే భక్తురాలిపై అత్యాచారానికి యత్నించడం భక్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. విజయవాడకు చెందిన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం స్వామివారి దర్శనం కోసం గ్రామంలోని ఆలయానికి వచ్చారు. వివాహమై చాలారోజులైనా పిల్లలు కలగకపోవడంతో ఆ దంపతులు సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడికి దానాలు సమర్పించి పాదాలకు నమస్కరించారు. సంతానం కలగాలంటే మహిళతో ఆలయంలో ఒంటరిగా మాట్లాడాలని, అప్పుడే కోరిక నెరవేరుతుందని అర్చకుడు వారికి మాయమాటలతో చెప్పడంతో అందుకు సరేనన్నారు.

దీంతో అతడు మహిళను దైవ సన్నిధిలోకి తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడుతూ అఘాయిత్యం చేయబోయాడు. పూజారి చేష్టలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సదరు మహిళ అతడిని నుంచి తప్పించుకునేందుకు కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందోనని షాక్‌ కు గురయ్యారు. తప్పించుకుని బయటకు వచ్చిన మహిళ విషయమంతా కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో వారు గుడిలోకి వచ్చేసరికే ఆ కీచక కామాంధుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితు కుటుంబం గ్రామస్థులకు చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు ఈ ఉదంతంపై దేవాదాయ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై వారు అంతర్గత విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆలయ అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Next Story