పిడుగుపాటుకు 10 మంది మృతి

By సుభాష్  Published on  10 April 2020 3:54 AM GMT
పిడుగుపాటుకు 10 మంది మృతి

ముఖ్యాంశాలు

  • ఏపీలో అకాల వర్షంతో భారీ పంట నష్టం

  • పిడుగుపాటుకు బలవుతున్న రైతన్నలు

  • వేలాది ఎకరాల్లో పంట నష్టం

  • నేలకొరిగిన అరటితోటలు

ఒక వైపు కరోనాతో దేశమంతా అతలాకుతలం అవుతుంటే మరో వైపు అకాల వర్షంతో తెలుగు రాష్ట్రాల్లో తీరని నష్టం వాటిల్లుతోంది. గురువారం అకాల వర్షంతో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పంట నష్టంతో పాటు పిడుగు పాటుకు కూడా కొందరు మృతి చెందారు. ఏపీలోని మూడు జిల్లాల్లో పిడుగుపడి పది మంది వరకు మృతి చెందగా, కృష్ణా జిల్లాలో పడవ మునిగి ఆరుగురు గల్లంతయ్యారు. ఇప్పటికి నలుగురి మృతదేహాలకు లభించగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక అరటి తోటలతో పాటు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గురువారం నుంచే ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. అలాగే నెల్లూరు జిల్లాలో పిడుగుపడి ఏడుగురు మృతి చెందారు.

అలాగే అల్లూరు మండలంల గోగులపల్లెకు చెందిన సుబ్బారావు, బోగోలు మండలం భాస్కరగిరివారికండ్రిగకు చెందిన పెంచల్ రెడ్డి, నాయుడుపేట మండలానికి చెందిన రైతు గుండాల శ్రీనివాస్, వరిగుంటపాడు గొల్లపల్లిలో ఆంజనేయులు, దగదర్తి మండలం చెన్నూరుకు చెందిన సుబ్బారాయుడు, శ్యాంసుందర్ పిడుగు పాటుకు మృత్యువాత పడ్డారు. అలాగే ఇదే జిల్లాలోని గొట్టిబ్రోలుకు చెందిన గురవయ్య పిడుగుపాటు శబ్దానికి గుండెపోటు వచ్చి మరణించాడు.

ఇక గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దపల్లి గొల్లపాలెంకు చెందిన రైతు బెల్లంకొండ లక్ష్మయ్య, రేపల్లె మండలంలోని గంగపాలెంకు చెందిన కన్నా నరేష్ , ప్రకాశం జిల్లాలోని మిట్టపాలెంలో లక్ష్మణరావు మృతి చెందారు. ఈ అకాల వర్షానికి పిడుగు పాటుతో మరణించడంతో పాటు తీవ్రమైన పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Next Story