కుమారస్వామి, ప్రశాంత్ కిశోర్ భేటీ.. జేడీఎస్ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిశోర్!
By సుభాష్ Published on 26 Feb 2020 4:28 PM GMTఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కీలక పాత్రపోషించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయం సాధించడంతో ప్రశాంత్ కిశోర్కు డిమాండ్ పెరిగింది. కాగా, తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నాయకులు కుమారస్వామి భేటీ చర్చనీయాంశంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో పని చేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని కుమారస్వామి తెలిపారు.
పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. ముందుగా చర్చలు జరిగాయని, ఇతర అంశాలు త్వరలో వెల్లడిస్తానని కుమారస్వామి పేర్కొన్నారు. కాగా, 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక సర్కార్ కుప్పకూలిపోయింది. తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యాడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ ఒక్కసీటు మాత్రమే గెలుపొందింది.