ఇంకా కోమాలోనే ప్రణబ్.. అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 12:15 PM GMT
ఇంకా కోమాలోనే ప్రణబ్.. అయితే..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇంకా కోమాలోనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రిఫెరల్‌ ఆస్పత్రి తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రణబ్‌ డీప్‌ కోమాలోనే ఉన్నప్పటికీ గతంలో కంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రణబ్‌ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్‌ రేటు స్థిరంగా, సాధారణంగా ఉన్నట్లు చెప్పారు. పైగా కిడ్నీల పనితీరు కూడా కొద్దిమేర మెరుగైందని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావటంతో ఆగస్టు 10 న సర్జరీ నిర్వహించారు. -

సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. అప్పటి నుండి ఆయన కోమాలోనే ఉన్నారు. అయితే అప్పటికే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయనను అత్యవసర వైద్య సేవల విభాగంలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి చికిత్స చేస్తున్న వైద్యుల ప్రకారం.. ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు . ఆయనకు బ్రెయిన్ సర్జరీ తో పాటు కరోనా వైరస్ సోకటం వల్ల అది ఆయన ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలని రాజకీయ నాయకులతో పాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story