సీఎం దగ్గర అందరిలా డబ్బాలు కొట్టే వ్యక్తిని కాదు: మాజీమంత్రి బాలినేని

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Feb 2024 10:36 AM GMT
ycp,  balineni srinivas, sensational comments, andhra pradesh,

 సీఎం దగ్గర అందరిలా డబ్బాలు కొట్టే వ్యక్తిని కాదు: మాజీమంత్రి బాలినేని

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సర్దుకుపోయి ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అవసరం అయితే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు. తాను సీఎం దగ్గరకు వెళ్లి ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారని అన్నారు. తాను సీఎం దగ్గరకు వెళ్లేది ప్రజలకు ఏదైనా ఇవ్వాలనేననీ.. అలిగేది కూడా ప్రజల కోసమే అన్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. 25వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నట్లు ఆయన చెప్పార. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడనీ సీఎం ఇంటెలిజెన్స్‌ అధికారులతో అంటున్నారని తెలిపారు. ప్రజల్లో జరుగుతున్న విషయాలు సీఎంకు తప్పకుండా చెప్పాలనీ.. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌ అన్నారు.

అయితే.. తాను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని మాజీమంత్రి బాలినేని చెప్పారు. ఇతర నాయకుల్లా సీఎం దగ్గర డబ్బాలు కొట్టనని చెప్పారు. ఇంతకంటే తనకు పోయేది ఏమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా పోరాడినట్లు చెప్పారు బాలినేని. కానీ.. మాగుంట పార్టీకి రాజీనామా చేశారని పేర్కొన్నారు.తాను కూడా సర్దుకుపోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలా అని ప్రశ్నించారు. ఉన్న పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం తనకు లేదన్నారు. చివరిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననీ చెప్పారు. అందుకు ఈసారి ప్రజలందరి ఆశీస్సులు కావాలని కోరారు మాజీమంత్రి బాలినేని.

సీఎం జగన్‌ దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లినట్లు చెప్పారు బాలినేని. ఐదేళ్లలో ఎన్జీవో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. పీఆర్సీ విషంలో కూడా గతంలో సీఎంతో చర్చించానని చెప్పారు. ఉద్యోగులు వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు బాలినేని చెప్పారు. అయితే.. రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరలోనే వస్తాయని ఆయన అన్నారు. ఇక ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎంని కోరతాననీ.. ఆ దిశగా పోరాడతానని మాజీమంత్రి బాలినేని అన్నారు.

Next Story