ఈటలను కౌగిలించుకున్న టీఆర్ఎస్‌ ఎంపీ

TRS MP K Keshava Rao Meet with Eetala Rajender.ఒకప్పుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో చక్రం తిప్పిన వ్యక్తి..!

By M.S.R  Published on  13 Dec 2021 8:39 AM GMT
ఈటలను కౌగిలించుకున్న టీఆర్ఎస్‌ ఎంపీ

ఒకప్పుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో చక్రం తిప్పిన వ్యక్తి..! ఆ తర్వాత కొన్ని పరిణామాల వలన బీజేపీ చెంతన చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈటల రాజేందర్ పార్టీ పరంగా వేరుగా ఉన్నా కూడా.. కొందరు టీఆర్ఎస్ నాయకులతో సాన్నిహిత్యాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఫంక్షన్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఈటల కూడా హాజరయ్యారు. ఫంక్షన్‌లో ఈటలను చూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు ఆప్యాయంగా ఆయన దగ్గరికెళ్లి హత్తుకున్నారు. భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా కాసేపు మాట్లాడడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌‌గా మారింది.

ఈటల రాజేందర్‌ను కౌగిలించుకోవడం అక్కడ ఉన్న పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈటల రాజేందర్‌ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ కేకే, ఈటలను కౌగిలించుకోవడంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు.

Next Story