చంద్రబాబు కోసమే ప్రశాంత్‌ కిశోర్‌ ఏపీ పాలిటిక్స్‌పై మాట్లాడారు: మంత్రి బొత్స

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 8:23 AM GMT
minister botsa, comments, prashant kishor, andhra pradesh,

చంద్రబాబు కోసమే ప్రశాంత్‌ కిశోర్‌ ఏపీ పాలిటిక్స్‌పై మాట్లాడారు: మంత్రి బొత్స 

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం మరోసారి వచ్చే అవకాశం లేదని అన్నారు. చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎంతో పోల్చారు. ఖాతాల్లో డబ్బులు జమ చేశారు కానీ.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడం కోసం కృషి చేయలేదని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రశాంత్‌ కిశోర్ కామెంట్స్‌పై వైసీపీ నాయకులు, మంత్రులు మండిపడుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌పై విమర్శలు చేశారు.

ప్రశాంత్‌ కిశోర్‌ కామెంట్స్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్‌ కిశోర్ ఏపీ పాలిటిక్స్‌ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. లీడర్‌ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్‌ అనే విషయాన్ని గుర్తించాలని ప్రశాంత్‌ కిశోర్‌కు మంత్రి బొత్స హితవు పలికారు. సీఎం జగన్‌ లీడర్‌ అయితే.. చంద్రబాబు ప్రొవైడర్‌ అని చెప్పారు. చంద్రబాబు చేసేది మేనేజ్‌మెంట్‌.. బ్రోకరిజం అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు వద్ద ప్రశాంత్‌ కిశోర్‌ ప్యాకేజీ తీసుకుని మరి ఇలా మాట్లాడుతున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

ఏపీలో సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి బొత్స అన్నారు. ఆ నిర్ణయాలతోనే విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. గత ఐదేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లిందన్నారు. జీడీపీలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలతోనే అభివృద్ధి అంతా సాధ్యమైందని మంత్రి బొత్స చెప్పారు. ప్యాకేజీ తీసుకున్న తర్వాతే చంద్రబాబుని పీకే పొగుడుతున్నారని మంత్రి బొత్స అన్నారు.

ప్రజల దృష్టిలో లీడర్ అంటే సీఎం జగన్‌ అని ఫిక్స్‌ అయ్యారని మంత్రి బొత్స అన్నారు. జగన్‌ పేరు చెబితే ప్రజల్లో ఒక ధైర్యం ఏర్పడిందన్నారు. ఆయన అన్ని రంగాల ప్రజలకు సంక్షమాన్ని అందిస్తున్నట్లు మంత్రి బొత్స చెప్పారు. ప్రశాంత్‌ కిశోర్‌ నిజానిజాలు తెలుసుకోవాలని.. ఆ తర్వాతే మాట్లాడాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

Next Story