కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్ బై? మంత్రుల బుజ్జగింపులు విఫలం!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టి. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది.
By - అంజి |
కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్ బై? మంత్రుల బుజ్జగింపులు విఫలం!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టి. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ (BRS) వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.
మంత్రులతో జరిగిన చర్చల్లో జీవన్ రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. "ప్రస్తుత పరిస్థితుల్లో నేను కాంగ్రెస్లో ఎందుకు కొనసాగాలి?" అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుండి చేరిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితేనే సమస్య పరిష్కారమవుతుందని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. అయితే, మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి పార్టీకి అత్యంత ముఖ్యమైన నేత అని, ఆయన ఆవేదనను ముఖ్యమంత్రి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతకు అన్యాయం జరిగితే అది మొత్తం పార్టీకి జరిగినట్లేనని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని, ఆయన త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.