లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ఇండియా కూటమి ప్రధాని ఎవరు?: అమిత్‌షా

ఇండియా కూటమికి ఇక దశదిశా అనేది లేదని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 9:48 AM GMT
bjp, amit shah,   india alliance, election ,

 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ఇండియా కూటమి ప్రధాని ఎవరు?: అమిత్‌షా 

దేశంలో ఇంకా లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బీజేపీ అభ్యర్థుల తరఫున ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. సిద్ధార్థనగర్‌లో గురువారం ఎన్నికల ర్యాలీలో పాల్గొని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగించారు. ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇండియా కూటమికి ఇక దశదిశా అనేది లేదని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. లోక్‌సభ ఎన్నికల్లో వారికి మెజార్టీ లభిస్తే.. ప్రధాన మంత్రి ఎవరు అవుతారనే దానిపై క్లారిటీ లేదని విమర్శించారు. ఒకవేళ అభ్యర్థిని మీరు ఎవరిని అనుకుంటున్నారో కనీసం చెప్పాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. శరద్‌ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఉద్దవ్‌ ఠాక్రే పదవిని పంచుకుంటారా అని ప్రశ్నించారు. విపక్ష కూటమి లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే ప్రధాన మంత్రి పదవికి రాహుల్‌గాంధీకి ఇస్తారా అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు.

విపక్ష కూటమిలో అసలు ప్రధాని అభ్యర్థి ఎవరనేది వారికే స్పష్టత లేదని అమిత్‌షా ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి విజయం సాధిస్తే ఏడాదికో ప్రధాని అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఇక దేశంలో ప్రజలెవరూ కాంగ్రెస్‌కు కానీ.. ఇండియా కూటమికి గానీ మద్దతుగా లేరని చెప్పారు. ఇండియా కూటమికి అధికారం ఇస్తే ఏం చేయరని ప్రజలు ముందే గ్రహించారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రధానిగా మళ్లీ మోదీనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తామే మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామనీ.. మోదీనే మరోసారి పీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Next Story