ఏపీలో అడుగు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి
By సుభాష్ Published on 1 July 2020 4:42 PM ISTతెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారి అనుమతి విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా పాస్ తీసుకోవాలని, పాస్ ఉన్నవారిని ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకే అనుమతిస్తామని చెప్పారు. రాత్రి సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని, అత్యవసర, నిత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, జాతీయ రహదారిపై అంతరాష్ట్రాలకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదని కేంద్ర హోంశాఖ అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో తెలిపింది.
అయితే మంగళవారం ఉదయం నుంచి పాసులు లేకుండా ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వందలాది మందిని పోలీసులు వెనక్కి పంపించారు. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత పాసులున్నవారికి అనుమతించకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.