గతానికి భిన్నంగా ఈ సారి పార్లమెంట్‌ సమావేశాలు..!

By సుభాష్  Published on  18 Aug 2020 2:33 AM GMT
గతానికి భిన్నంగా ఈ సారి పార్లమెంట్‌ సమావేశాలు..!

సెప్టెంబర్‌ మొదటి వారంలో వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సారి నిర్వహించే సమావేశాల్లో సీటింగ్‌ విధానం మారనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సోమవారం లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను పరిశీలించారు. కరోనా వైరస్‌ కారణంగా సభలో సీటింగ్‌ విధానం మార్చనున్నారు.

అంతేకాకుండా భౌతిక దూరం, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. భౌతిక దూరం నిబంధనల నేపథ్యంలో ఈ సారి జరిగే సమావేశాల్లో కొత్త సీటింగ్‌ విధానం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని రాజ్యసభ సెక్రటేరియట్‌ తెలిపింది.

అలాగే రాజ్యసభలోని సభ్యుల సీటింగ్‌ కోసం ఛాంబర్లతో పాటు గ్యాలరీలను కూడా వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. ఇక రాజ్యసభ ఛాంబర్‌లో 60 మంది, గ్యాలరీల్లో 51 మందికి సీటింగ్‌ కల్పించనున్నట్లు తెలుస్తోంది. మిగతా 132 మంది రాజ్యసభ సభ్యులకు లోక్‌సభలో సీటింగ్‌ కల్పించనున్నారు. ఈ విధంగా సమావేశాలు జరగడం పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి కానుంది.

Next Story