ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్.. ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం..!
By అంజి Published on 29 Dec 2019 3:10 PM ISTముఖ్యాంశాలు
- నావికదళం గూఢ చర్యం కేసులో విచారణ వేగవంతం
- తూర్పు నావికాదళాన్ని సందర్శించనున్న ఎన్ఐఏ
- ప్రస్తుతం ఎన్ఐఏ కోర్టు రిమాండ్లో ఏడుగురు నిందితులు
విశాఖ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకు నిఘా సమాచారం చేరవేస్తున్న భారత నావికదళం ఉద్యోగుల కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం చేశారు. హనీ ట్రాప్ ద్వారా పాకిస్తాన్కు కీలక సమాచారం చేరవేస్తున్న ఏడుగురిని ఇటీవల నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ ఎన్ఐఏ కోర్టు రిమాండ్లో ఏడుగురు నిందితులు ఉన్నారు. జనవరి 3తో నిందితుల రిమాండ్ గడువు ముగియనుంది. ఈ కేసులో మరింత సమాచారం కోసం ఎన్ఐఏ అధికారులు కూపీ లాగుతున్నారు. ఎన్ఐఏ బృందం త్వరలో తూర్పు నావికాదళాన్ని సందర్శించనుంది. ఈ బృందానికి ఎన్ఐఏ ఏఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వం వహించనున్నారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, నేవీ ఇంటెలిజెన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్… పాకిస్తాన్తో సంబంధాలున్న గూఢ చర్యం రాకెట్ను వెలికితీసినట్లు ఏపీ డిజిపి డి. గౌతమ్ సవాంగ్ కార్యాలయానికి గత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి. నేవీ సంస్థ ద్వారా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బంది, ఒక హవాలా ఆపరేటర్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఈ ఎనిమిది మంది శత్రు దేశమైన పాకిస్థాన్ తో చేతులు కలిపి గూఢ చర్యం చేస్తున్నారని, మన దేశానికి సంబంధించిన సీక్రెట్లను శత్రు దేశానికి చేరవేస్తున్నారన్న అనుమానంతో వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.
దీనిపై మరింత సమాచారాన్ని సేకరించేందుకు మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ఇలా అనుమానితులుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకుంటున్నారు. నేవీ, సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ ద్వారా గూఢచర్యం చేసే వారిని పట్టుకుని, వారిని విచారణ చేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.