అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ @450 కోట్లు

World's largest canvas painting sells for a whopping Rs 450 crore.కానీ, ఓ చిత్రకారుడు దుబాయ్‌ హోటల్‌లో పెయింటింగ్‌ వేస్తూ ఉండిపోయాడు. 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాన్వాస్‌పై అతడు వేసిన పెయింటింగ్‌ ఇప్పుడు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2021 5:35 AM GMT
Worlds largest canvas painting

సుమారు సంవత్సర కాలంగా కరోనా మనల్ని కదలనివ్వకుండా చేసింది. కరోనా పై చేసే పోరాటం లో భాగంగా పెట్టిన లాక్ డౌన్ మనల్ని సైకాలాజికల్ డౌన్ చేసేసింది. అయితే కొందరు మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గతేడాది అందరూ కరోనా భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.. కానీ, ఓ చిత్రకారుడు దుబాయ్‌ హోటల్‌లో పెయింటింగ్‌ వేస్తూ ఉండిపోయాడు. 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాన్వాస్‌పై అతడు వేసిన పెయింటింగ్‌ ఇప్పుడు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్‌ పెయింటింగ్‌గా రికార్డు సృష్టించింది. ఇదే గొప్ప విషయం అంటే..తాజాగా ఆ పెయింటింగ్‌ ఊహించని ధరకు అమ్ముడుపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కరోనా సంక్షోభంలో చిన్నారులకు చేయూతనివ్వడం కోసం బ్రిటన్‌కు చెందిన చిత్రకారుడు సాషా జాఫ్రి 'ది జర్నీ ఆఫ్‌ హ్యుమానిటీ' పేరుతో గతేడాది మార్చి చివరివారంలో దుబాయ్‌లోని అట్లాంటిస్‌ ది పామ్‌ హోటల్‌లో భారీ కాన్వాస్‌ పెయింటింగ్‌ వేయడం మొదలుపెట్టాడు. సుమారు ఏడు నెలలపాటు రోజుకు 20 గంటలు కష్టపడి పెయింటింగ్‌ను పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ పెయింటింగ్‌కు గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కింది. కాగా, ఇటీవల ఆ భారీ పెయింటింగ్‌ను 70 ఫ్రేములుగా విభజించి వేలంలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫ్రేమ్స్‌ను అమ్మితే కనీసం 32మిలియన్‌ డాలర్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.



అయితే, చిన్నారుల కోసం పెయింటింగ్‌ విక్రయిస్తున్నారని తెలిసి దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దూన్‌ ఆ ఫ్రేమ్స్‌ అన్నింటిని ఒక్కడే కొనుగోలు చేశాడు. ఇందుకోసం జాఫ్రి నిర్దేశించుకున్న నగదుకు డబుల్ 62మిలియన్‌ డాలర్లు చెల్లించాడు. జాఫ్రి వేసిన పెయింటింగ్‌ ఎంతో బాగుందని, అంత అద్భుతమైన దానిని వేరు చేయడం ఇష్టం లేకనే అన్నింటిని తానే కొంటున్నట్లు తెలిపాడు. అలాగే, పేదకుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలి గురించి బాగా తెలుసని, పేదరికంలో మగ్గుతున్న చిన్నారులకు ఈ విధంగా సాయం చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. పెయింటింగ్‌ విక్రయించగా వచ్చిన డబ్బును చిన్నారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేయనున్నట్లు జాఫ్రి, వేలం నిర్వాహకులు తెలిపారు.




Next Story