ఢిల్లీలో సరి-బేసి విధానం.. అతిక్రమించారో..
By Medi Samrat Published on 4 Nov 2019 7:34 AM GMTముఖ్యాంశాలు
- నేటి నుండే అమలు
- అతిక్రమిస్తే 4వేలు జరిమానా
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నేటి నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం సరి - బేసి విధానాన్ని అమలు చేస్తుంది. ఆదివారం మినహాయింపు ఉంటుంది. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు సరి - బేసి సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండనుంది. నేడు రాజధానిలోకి సరి సంఖ్యల వాహనాలనే అనుమతిస్తారు. సరి - బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ. 4 వేలు జరిమానా విధించనున్నారు. ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన వర్తించదు. ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా 2015లో సరి - బేసి విధానాన్ని అమలు చేసింది.
అయితే సరి - బేసి విధానం నుంచి అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి మినహాయింపు కల్పించినప్పటికీ.. ఢిల్లీ సీఎం, మంత్రులకు మాత్రం మినహాయింపు కల్పించలేదు. ఎమర్జెన్సీ సర్వీసులకు సరి - బేసి విధానం నుంచి మినహాయింపు కల్పించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు కూడా ఈ విధానం నుంచి వెసులుబాటు కల్పించారు.