ముందుకు కదలని మహారాష్ట్ర రాజకీయం..!!
By న్యూస్మీటర్ తెలుగు
ముంబై : శివసేన శాసనసభాపక్ష నాయకుడిగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. ధినేత ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే, ఆదిత్య థాకరే, దివాకర్ రౌతే, సుభాష్ దేశాయి కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశారీని కలిశారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105 సీట్లు, శివసేన 56సీట్లు గెలుచుకున్నాయి . గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 17 సీట్లను కోల్పోయింది. శివసేన కొన్ని సీట్లలో ప్లస్ అయింది. దీంతో..బీజీపీ బలం తగ్గింది కాబట్టి..సీఎం సీటు తమకు రెండున్నరేళ్లు ఇవ్వాలని శివసేన పట్టుబడుతుంది. మరో వైపు తమ పార్టీ మద్దతు బీజేపీకేనని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ప్రకటించారు.