మెయిల్‌ కలకలం.. ప్రధాని మోదీకి ప్రాణహాని..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2020 7:21 AM GMT
మెయిల్‌ కలకలం.. ప్రధాని మోదీకి ప్రాణహాని..?

భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరిస్తూ ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ)కు ఈ మెయిల్‌ రావడం కలకలం రేపింది. మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఓ ఈమెయిల్‌ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపుతూ వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఐఏ లేఖలో కోరింది.

ఆగస్టు 8 నాటి ఈ మెయిల్‌లో 'కిల్‌ నరేంద్ర మోడీ' అన్న మూడు పదాల మెసేజ్‌ ప్రస్తుతం ఎన్‌ఐఏ వర్గాలను కంగారు పెడుతోంది. ఈ అంశాన్ని హైలెవల్‌ సెక్యూరిటీ అంశంగా పరిగణించిన ఎన్‌ఐఏ.. హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రధానమంత్రి మోడీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధానికి భద్రతను కల్పించే ఎస్‌పీజీ దృష్టికి తీసుకువెళ్లింది. బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేపట్టేందుకు రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్‌ఐఏ రంగంలోకి దించింది. అసలు ఈమెయిల్‌ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story