భారీ టార్గెట్‌ ను ఊదేశారు..

By Newsmeter.Network  Published on  24 Jan 2020 10:58 AM GMT
భారీ టార్గెట్‌ ను ఊదేశారు..

కివీస్‌ పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. దీంతో ఐదు టీ20 ల సిరీస్‌ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్‌ 16 పరుగుల వద్ద రోహిత్ శర్మ(7; 6బంతుల్లో 1x6 ‌) సాంట్నర్‌ బౌలింగ్‌ లో టేలర్ కి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (56; 27 బంతుల్లో 4x4, 3x6), కి కెప్టెన్ విరాట్ కోహ్లీ (45; 32 బంతుల్లో 3x4, 1x6) జతకలిసారు. ఇద్దరూ ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్‌ వేగాన్ని పెంచారు. వీరిద్దరు వెంట వెంటనే అవుట్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.

అయితే యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్; 29 బంతుల్లో 5x4, 3x6) హిట్టింగ్‌తో టిమిండియాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. శ్రేయాస్‌ విజృంభనతో 19 ఓవర్లలోనే టీమిండియా 204/4తో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోధి రెండు వికెట్లు తీయగా బ్లెయిర్ టిక్నర్, సాంటర్న్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాస్ అయ్యర్‌ కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

Ind1 0

అంతముందు టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఆది నుంచి దూకుడుగా ఆడుతూ టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశారు. మొదటి వికెట్‌ కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 19 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 30 పరుగులు చేశాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించగా హిట్‌ మ్యాన్‌ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్‌ తో పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ మున్రో మాత్రం 42 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేసి కివీస్‌ జట్టు స్కోర్‌లో తనదైన పాత్ర పోషించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్‌ పట్టడంతో మున్రో బ్యాటింగ్‌కు తెరపడింది.

కివీస్‌ కెప్టెన్ విలియమ్‌సన్ కూడా 26 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసి రాణించాడు. చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కోహ్లీకి క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. డీ గ్రాండ్‌హోమ్ కివీస్ అభిమానులను నిరాశపరిచాడు. జడేజా బౌలింగ్‌లో ఆడిన రెండో బంతికి గ్రాండ్‌హోమ్ శివమ్ దూబేకు క్యాచ్‌గా చిక్కి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో టేలర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా, శార్దూల్ ఠాకూర్, జడేజా, చాహల్, శివమ్ దూబేలకు తలో వికెట్ దక్కింది.

Next Story