యువతి కిడ్నాప్ డ్రామా.. రూ.30 లక్షలు డిమాండ్

ఓ యువతి తనకు తానే కిడ్నాప్ చేసుకుని.. తండ్రి వద్ద నుంచి రూ.30లక్షలను డిమాండ్ చేసింది.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 11:52 AM GMT
young girl, kidnap drama,  rs.30 lakhs, madhya pradesh,

 యువతి కిడ్నాప్ డ్రామా.. రూ.30 లక్షలు డిమాండ్ 

ఓ యువతి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వరు అని.. క్రిమినల్‌ ఐడియా వేసింది. కిడ్నాప్ డ్రామా ఆడింది. కొందరు వ్యక్తులు తనని కిడ్నాప్ చేశారని చెప్పించింది. అంతేకాదు.. చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలను కూడా తండ్రికి పంపి ఆందోళనకు గురిచేసింది.

మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది ఈ సంఘటన. శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్య ఈ పని చేసింది. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రాజస్తాన్‌లో ఉన్న కోటాలోని కోచింగ్ సెంటర్‌ల్‌ కావ్యను తల్లిదండ్రులు చేర్చారు. కుమార్తెతో పాటే మూడ్రోజులు తల్లి ఉండి.. ఆ తర్వాత సొంత గ్రామానికి వెళ్లిపోయింది. కాగా.. కావ్య ప్లాన్‌ మాత్రం మరోటి పెట్టుకుంది. స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లి.. అక్కడే చదువుకోవాలని భావించింది. తల్లి వెళ్లిన తర్వాత వెంటనే ఆమె ప్లాన్‌ను అలు చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన ఇద్దరు మగ స్నేహితుల వద్దకు వెళ్లింది. ఒకే రూమ్‌లో వీరు ముగ్గురూ ఉన్నారు. కావ్య తన తల్లిదండ్రులో మాత్రం కోటాలోనే ఉన్నాననీ చదువుకుంటున్నానని చెప్పింది. పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలను కూడా పేరెంట్స్ మొబైల్‌ ఫోన్‌కు పంపింది. దాంతో.. వారు కూడా నమ్మేశారు.

ఉన్నట్లుండి మార్చి 18న కావ్య తండ్రి మొబైల్‌ఫోన్‌కు కొన్ని ఫొటోలు వచ్చాయి. మీ కుమార్తెను కిడ్నాప్ చేశామనీ.. డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి ఉన్న తన కూతురి ఫొటోను చూసిన ఆ తండ్రి భయపడిపోయాడు. రూ.30 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని చెప్పడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కావ్య తండ్రి కోటాకు వెళ్లాడు.. అక్కడ తన కుమార్తె గురించి ఆరా తీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తల్లి కావ్యను వదిలిపెట్టిన మూడ్రోజులకే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లిపోతున్నట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. విచారణ కావ్య స్నేహితురాళ్ల ద్వారా కిడ్నాప్‌ కూడా ఒక డ్రామా అని నిర్ధారించారు. విదేశాల్లో చదువుకునేందుకు తండ్రి వద్ద నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు.

కిడ్నాప్‌ నాటకమని తేలడంతో పోలీసులు కావ్య, ఆమె స్నేహితల కోసం ఒక ప్రకటన చేశారు. ముగ్గురూ ఎక్కడ ఉన్నా పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పారు. సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసినట్లు చెప్పారు. ఇదే సంఘటనపై శివపురి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కావ్య కోసం గాలిస్తున్నారు.

Next Story