ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు పాన్కార్డు అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో ఆ అకౌంట్ నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. కస్టమర్ పాన్ కార్డు అప్డేట్ కాకపోతే.. వారి ఐపీపీబీ ఖాతా 24 గంటల్లోగా బ్లాక్ అవుతుందంటూ కొందరు ఫేక్ సందేశాలు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి ఫేక్ మెసేజస్, పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పోస్ట్ పెట్టింది.
ఇండియా పోస్ట్ ఆఫీస్ ఎప్పుడూ ఇలాంటి సందేశాలను పంపదని, వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని సూచించింది. అలాగే ఇలాంటి వార్తలను ఇతరులకు షేర్ చేసేటప్పుడు కూడా ధ్రువీకరించుకోవాలని కోరింది.