ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భార్యకు వచ్చే ఫించన్పై పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భార్యకు ఉన్న కుటుంబ ఫించను హక్కు కాదనలేనిదని.. ఒకవేళ ఆమె తన భర్తను హత్యచేసినా.. భర్త మరణానంతరం మరో పెళ్లి చేసుకున్నా సరే ఫించను ఇవ్వాల్సిందేనని హరిణాయాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.
హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ భర్త తర్సెమ్సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. 2008లో ఆయన మరణించగా.. 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2011లో ఆమెకు శిక్ష పడింది. దీంతో.. అప్పటి వరకు బల్జీత్ కౌర్కు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం.. ఆమెకు శిక్ష పడగానే నిలిపివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం భర్తను ఆమె హత్య చేసినప్పటికీ, ఫించను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనబెడుతూ.. బల్జీత్కౌర్కు రావాల్సిన కుటుంబ ఫించను, పాత బకాయిలను రెండునెలల్లో చెల్లించాలని న్యాయస్థానం సంబంధితశాఖను ఆదేశించింది.
బంగారు గుడ్డు పెట్టే కోడిని ఎవరూ కిరాతకంగా చంపుకోరు అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కుటుంబ ఫించను అనేది సంక్షేమ పథకం. ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు దాన్ని ప్రవేశపెట్టారు. క్రిమినల్ కేసులో ఆమెకు జెలు శిక్ష పడ్డా ఈ పథకం కింద భార్యకున్న హక్కును కాదనలేమని.. 1972సీసీఎస్(ఫించను) నిబంధనల మేరకు హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.