మైనర్గా తేలిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా.. భర్తపై పోక్సో కేసు నమోదు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ మొదటిసారిగా మోనాలిసా వెలుగులోకి వచ్చింది.
By - Medi Samrat |
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ మొదటిసారిగా మోనాలిసా వెలుగులోకి వచ్చింది. ఒక కంటెంట్ క్రియేటర్ ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్గా మారి ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది.
ఒక ముస్లిం యువకుడితో వివాహం చేసుకుని మోనాలిసా మళ్లీ వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆమె మైనర్ అని నిర్ధారణ కావడంతో, ఆమె భర్త ఫర్మాన్పై పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధమైన వివాహంతో పాటుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కూడా అతనిపై కేసులు నమోదు చేశారు. అధికారిక ఆసుపత్రి రికార్డుల ఆధారంగా, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మోనాలిసా డిసెంబర్ 30, 2009న జన్మించినట్లు నిర్ధారించింది. దీని ప్రకారం, ఈ ఏడాది మార్చి 11న వివాహం జరిగే నాటికి ఆమె వయస్సు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు.
కేరళలోని నైనార్ దేవా ఆలయంలో జరిగిన వివాహం తర్వాత విచారణ ప్రారంభమైంది. దంపతుల ఆధార్ కార్డుల్లో పేర్కొన్న వయస్సు ఆధారంగానే వివాహ వేడుక నిర్వహించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ దర్యాప్తు అధికారులకు తెలిపింది. ఆ తర్వాత నకిలీ జనన ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ వివాహాన్ని రిజిస్టర్ చేసినట్లు విచారణ బృందం గుర్తించింది. మహేశ్వర్ మున్సిపాలిటీ జారీ చేసిన ఆ నకిలీ సర్టిఫికెట్లో మోనాలిసా పుట్టిన తేదీని జనవరి 1, 2008గా నమోదు చేశారు, ఇది ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల కంటే దాదాపు రెండేళ్లు ముందు. ఈ నకిలీ పత్రాన్ని వెంటనే రద్దు చేయాలని కమిషన్ స్థానిక అధికారులను ఆదేశించింది.