కుర్రాళ్ల నుంచి తప్పించుకునేందుకు 140 కి.మీ పారిపోయిన అమ్మాయిలు
స్కూల్ అయినా, కాలేజైనా లేదా ఆఫీసు అయినా మహిళలకు అక్కడక్కడ వేధింపులు తప్పడం లేదు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 6:42 AM IST
కుర్రాళ్ల నుంచి తప్పించుకునేందుకు 140 కి.మీ పారిపోయిన అమ్మాయిలు
స్కూల్ అయినా, కాలేజైనా లేదా ఆఫీసు అయినా మహిళలకు అక్కడక్కడ వేధింపులు తప్పడం లేదు. ఇక రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకతాయిలు చేసే టీజింగ్ తో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో ఇలాంటి ఆకతాయిల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు అమ్మాయిలు ఏకంగా 140 కిలోమీటర్లు వెళ్లిపోయారు.
ఉత్తర్ ప్రదేశ్లోని హథ్రాస్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది ఆకతాయి యువకులు రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు బాలికలను వేధిండం మొదలుపెట్టారు. ఆగస్టు మూడో తేదీన ఇద్దరు బాలికలు చీకటి పడిన తర్వాత ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా కుర్రాల్లు వెంట పడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరు బాలికలు పరుగు తీశారు. దారి మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఆగిఉన్న గూడ్స్ రైలు ఎక్కి కూర్చున్నారు. ఆకతాయి అక్కడే కాసేపు వెతకసాగారు. దాంతో.. రైలులోనే ఉండిపోయారు ఇద్దరు బాలికలు. రైలు బయల్దేరేందుకు సమయం అవ్వడంతో హత్రాస్ నుంచి ప్రయాణం మొదలైంది. రైలు ముందుకు సాగడంతో బాలికలు ట్రైన్ నుంచి బయటకు దిగలేకపోయారు. అలా హత్రాస్లో మొదలైన ట్రైన్ ఇటావాలో ఆగింది. ఆ స్టేషన్లో దిగిన ఇద్దరు బాలికలకు ఏం చేయాలో పాలుపోలేదు.
స్టేషన్లోనే కూర్చొని ఏడుస్తున్నారు. అప్పుడే స్టేషన్లో వారిని గమనించిన ట్రెయిన్ గార్డు ఆర్య వారి దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని ఆరా తీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరు బాధిత బాలికలు జరిగిన ఉదంతం మొత్తం వివరించారు. వారిచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఇంట్లోవారికి సమాచారం అందించాడు. ఆ తర్వాత స్టేషన్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. చివరకు ఇద్దరు బాలికలను సురక్షితంగా వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు.