జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ పింపుల్'.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. కుప్వారా జిల్లాలో కేరన్ ప్రాంతంలో నిర్వహించిన...

By -  అంజి
Published on : 8 Nov 2025 9:14 AM IST

Two terrorists killed, army, Operation Pimple, Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ పింపుల్'.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. కుప్వారా జిల్లాలో కేరన్ ప్రాంతంలో నిర్వహించిన 'ఆపరేషన్ పింపుల్‌'లో సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ వైపు నుండి చొరబాటు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వారిని గుర్తించిన భద్రతా దళాలు వెంటనే చర్యలు తీసుకున్నాయి.

సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. దొంగచాటుగా ఎల్‌ఓసీ దాటి రావడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను ముందుగానే పసిగట్టారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు అక్కడికక్కడే హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో, సైన్యం పహరాను మరింత కట్టుదిట్టం చేసింది. చినార్ కార్ప్స్ ప్రకారం, ఆ ప్రాంతంలో ప్రస్తుతం అన్వేషణ కొనసాగుతోంది.

చొరబాటు ప్రయత్నానికి సంబంధించి ఏజెన్సీల నుండి వచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా నవంబర్ 7న ఆపరేషన్ ప్రారంభమైంది. "అప్రమత్త దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించి, వ్యక్తులను సవాలు చేశాయి. ఉగ్రవాదులు చిక్కుకున్నారు" అని చినార్ కార్ప్స్ శుక్రవారం Xలో తెలిపింది. కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ఛత్రు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన మూడు రోజుల తర్వాత ఇది జరిగింది.

Next Story