ఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒక ఊరగాయ తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు ఊపిరాడక 60 ఏళ్ల ఫ్యాక్టరీ యజమాని, అతని కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. రావు విహార్లోని అనిల్ (60) అనే వ్యక్తి తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఊరగాయ తయారీ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఊరగాయల తయారీ కోసం సుమారు 10 అడుగుల లోతు ఉన్న 4 నుంచి 5 గొయ్యిలు (సెప్టిక్ ట్యాంక్ లాంటి నిర్మాణాలు) ఉన్నాయి.
శుక్రవారం సాయంత్రం ఓ కార్మికుడు శుభ్రం చేయడానికి గొయ్యిలోకి దిగగా, అక్కడ ఆక్సిజన్ అందక స్పృహ కోల్పోయాడు. అతడిని రక్షించే క్రమంలో యజమాని అనిల్, అతని ఇద్దరు కుమారులు నీరజ్ (32), సందీప్ (28) ఒకరి తర్వాత ఒకరు గొయ్యిలోకి దిగారు. అయితే లోపల విషవాయువులు ఉండటం లేదా ఆక్సిజన్ లేకపోవడంతో నలుగురూ స్పృహ కోల్పోయారు. స్థానికులు, అనిల్ సోదరుడు సుభాష్ కలిసి వారిని బయటకు తీసి సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు అనిల్, నీరజ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.