ఈశాన్య రాష్ట్రాల్లో మొద‌లైన కౌంటింగ్‌.. గెలుపెవ‌రిదో..?

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 4:01 AM GMT
Assembly Election Results 2023, North East Election Results

Counting of votes underway

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. నేటి(గురువారం) ఉద‌యం 8 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు మొద‌లైంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు నేప‌థ్యంలో ఆయా కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట‌ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగాలాండ్‌, మేఘాల‌యాలో ఒక్కొ అసెంబ్లీ సీటు ఏక‌గ్రీవమైంది. ఫిబ్రవరి 16న త్రిపురలో, ఫిబ్రవరి 27న నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. త్రిపుర‌లో 88 శాతం, మేఘాల‌యాలో 76 శాతం, నాగాలాండ్ రాష్ట్రంలో 84 శాతం ఓట్లు పోల‌య్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ 31. ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చేది ఎవ‌రో కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

ఇదిలా ఉంటే.. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. అయితే.. మేఘాలయలో మాత్రం కన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి. మ‌రీ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నిజం అవుతాయో లేదో చూడాలి.

Next Story