సీఎం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. నా కోసం ట్రాపిక్ ఆపొద్దు..

Tamil Nadu CM M K Stalin to have fewer vehicles in convoy.అధికారంలోకి వ‌చ్చేందుకు రాజ‌కీయాలు చేయాలి గానీ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Oct 2021 6:48 AM GMT
సీఎం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. నా కోసం ట్రాపిక్ ఆపొద్దు..

అధికారంలోకి వ‌చ్చేందుకు రాజ‌కీయాలు చేయాలి గానీ.. అధికారంలో ఉన్న‌ప్పుడు రాజ‌కీయాలు చేయ‌కూడ‌దు అని చెప్పి ఆ సిద్దాంతాన్ని ఖ‌చ్చితంగా పాటిస్తున్నారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌. ఆయ‌న సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌జాహిత నిర్ణ‌యాల‌తో ముందుకు వెలుతున్నారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల ప‌ట్ల ప్ర‌జ‌ల నుంచే కాకుండా ప్ర‌తి ప‌క్షాల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతుండ‌డం విశేషం. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

తాను ప్రయాణించే కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను స‌గానికి తగ్గించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా పయనించే రీతిలో చర్యలు తీసుకోవాలని అధికారుల‌కు సూచించారు. దీంతో ఆదివారం నుంచి సీఎం ప్ర‌యాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయ‌రు. ప్ర‌జ‌ల వాహ‌నాల‌తో పాటే సీఎం కాన్వాయ్ కూడా వెళ్ల‌నుంది. ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న కాన్వాయ్‌లో 12 వాహ‌నాలు ఉండ‌గా.. నేటి నుంచి 6 వాహ‌నాలు మాత్ర‌మే ఉండ‌నున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీ ఐరా అన్బు, అదనపు సెక్రెటరీ ఎస్కే ప్రభాకర్, డీజీపీ శైలేంద్ర బాబు, అదనపు డీజీపీ డేవిడ్‌సన్ దేవసిరివతమ్ తదితర ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

శనివారం ఇక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు వీల్‌చైర్‌లు, స్కూటర్లను సీఎం స్టాలిన్ పంపిణీ చేశారు. అదేవిధంగా స్కూటర్ల మరమ్మతుల నిమిత్తం రూ. 1,500 సాయంకు శ్రీకారం చుట్టారు.

Next Story