'పితృత్వ సెలవులపై చట్టం తీసుకురండి'.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
పిల్లల పెంపకంలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
By - అంజి |
'పితృత్వ సెలవులపై చట్టం తీసుకురండి'.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
పిల్లల పెంపకంలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. మాతృత్వ సెలవుల తరహాలోనే పితృత్వ సెలవులను కూడా ఒక సామాజిక భద్రతా ప్రయోజనంగా పరిగణించాలని, దీని కోసం తగిన చట్టాన్ని తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
చారిత్రక కాలం నుండి బిడ్డ సంరక్షణ బాధ్యతలను కేవలం తల్లులకే పరిమితం చేస్తూ సమాజం ఒక రకమైన అన్యాయాన్ని అలవాటు చేసుకుందని కోర్టు అభిప్రాయపడింది. "పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర చాలా కీలకమైనది, అందులో సందేహం లేదు. కానీ, అంతే సమానమైన తండ్రి పాత్రను విస్మరించడం అన్యాయం అవుతుంది" అని ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగ బాధ్యతల వల్ల తండ్రి బిడ్డకు దూరం కావడం వల్ల, అటు తండ్రి పెంపకానికి బిడ్డ దూరం అవ్వడమే కాకుండా, ఇటు తల్లిపై పని భారం పెరిగి ఆమెకు తన భాగస్వామి మద్దతు లభించకుండా పోతోందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్న మహిళలకు మాతృత్వ సెలవులను నిరాకరించే 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ'లోని ఒక నిబంధనను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 15 రోజుల పితృత్వ సెలవుల నిబంధనను (CCS Leave Rules) ప్రాతిపదికగా తీసుకుని, అందరికీ వర్తించేలా సమగ్ర చట్టం చేయాలని కోరింది. పితృత్వ సెలవులు కల్పించడం వల్ల తండ్రులు తమ కుటుంబ బాధ్యతలను పంచుకోవడమే కాకుండా, సమాజంలో నెలకొన్న లింగ వివక్షతతో కూడిన పేరెంటింగ్ పద్ధతులు మారుతాయని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.