ఆ అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈశా ఆశ్రమంలో ఉంటున్నారు: సుప్రీం

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌ లో ఇద్దరు మహిళలను బందీలుగా ఉంచారని ఆరోపిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

By Kalasani Durgapraveen  Published on  18 Oct 2024 2:15 PM GMT
ఆ అక్కాచెల్లెళ్లు ఇష్టపూర్వకంగానే ఈశా ఆశ్రమంలో ఉంటున్నారు: సుప్రీం

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌ లో ఇద్దరు మహిళలను బందీలుగా ఉంచారని ఆరోపిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో తన ఇద్దరు కుమార్తెలు 42 ఏళ్ల గీత, 39 ఏళ్ల లత బందీలుగా ఉన్నారని ఆరోపిస్తూ కామరాజ్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, మహిళలు ఇద్దరూ మేజర్‌లని, వారు స్వచ్ఛందంగా, ఎటువంటి బలవంతం లేకుండా ఆశ్రమంలో నివసిస్తున్నారని గుర్తించింది. ఇద్దరు మహిళలు మేజర్‌లని, వారు స్వచ్ఛందంగా ఆశ్రమంలో నివసిస్తున్నారని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది.

కామరాజ్‌ మొదట మద్రాసు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈశా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారన్నారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ఈశా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వాలంటూ పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఈశా ఫౌండేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఆ ఇద్దరు యువతులు ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉన్నట్లు వారు చెప్పారని పోలీసుల విచారణలో తేలగా.. ఆ వివరాలు సుప్రీం కోర్టుకు కూడా అందించారు. విచారణ సందర్భంగా ఇద్దరు యువతుల్లో ఒకరు సుప్రీంకోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. తాము స్వేచ్ఛగానే జీవిస్తున్నామని వివరణ ఇచ్చారు.


Next Story