పరీక్షలు పెట్టకండంటున్న సోనూ..!
Sonu Sood supports cancel board exam 2021. సోనూ సూద్'cancel board exams' కు తాను కూడా మద్దతుగా నిలుస్తున్నానని తెలిపాడు.
By Medi Samrat Published on 11 April 2021 2:17 PM IST
ప్రస్తుతం పరీక్షలు నిర్వహించాలని వివిధ విద్యా సంస్థల బోర్డులు అనుకుంటూ ఉన్నాయి. అయితే ఇది సరైన సమయం కాదని.. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటూ తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అని సోనూ సూద్ అంటూ ఉన్నారు. 'cancel board exams' కు తాను కూడా మద్దతుగా నిలుస్తున్నానని తెలిపాడు. సీబీఎస్ఈ ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నాడు సోనూ. విద్యార్థులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు రాయడానికి సిద్ధంగా లేరని సోనూ చెప్పుకొచ్చాడు. విద్యార్థులు పరీక్షల కోసం హాజరవ్వడం వలన కరోనా ప్రమాదం కూడా పొంచి ఉందని తేల్చి చెప్పాడు. అందుకు సంబంధించి ఓ ట్వీట్ ను కూడా పోస్టు చేశాడు సోనూ సూద్.
సోనూ సూద్.. సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు. తాజాగా కూడా ఆయన మరో సహాయం చేశాడు. విద్యార్థుల కోసం సోనూ ఏకంగా సెల్ ఫోన్ టవర్ నే ఏర్పాటు చేయించాడు. మహారాష్ట్రలోని గోడియా జిల్లాకు చెందిన అన్మోల్ బిరన్వార్, మున్నా బిరన్వార్ అనే సోదరులు కరోనా నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు 50 మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. వారి గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ విషయంలో తమకు సాయం చేయాలంటూ అన్మోల్ బిరన్వార్ నటుడు సోనూ సూద్ ను సాయం కోరాడు. ఆ సోదరుల ట్వీట్ కు స్పందించిన సోనూ సూద్ తన స్నేహితుడు కరణ్ గిల్హోత్రా సాయంతో ఓ సెల్ టవర్ నిర్మాణానికి అడుగులు వేశారు. ఇటీవలే ఆ టవర్ నిర్మాణం పూర్తికావడంతో ఆ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం ఏర్పడింది.