మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలోని ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం స్పష్టం చేసింది. మరాఠా రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది. ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా ఈ రిజర్వేషన్ ఇవ్వబడిందని, అయితే మరాఠాలు ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి లేరని సుప్రీం ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. గతేడాది మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగాల్లో 12 శాతం కోటా కల్పించింది.
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీం కోరింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పునఃపరిశీలన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఇది ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపింది. జస్టిస్ అశోక్ భూషణ్ తన తీర్పులో మరాఠాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్న సవరణను తొలగించారు. మరాఠాలకు విద్య, ఉపాధికి 13 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సవరణను రద్దు చేసినట్లు తెలిపారు. పీజీ మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. అయితే గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.