ఆదివార‌మే నీట్ ప‌రీక్ష‌.. వాయిదా వేయ‌డం కుద‌ర‌దు

SC Refuses To Postpone NEET-UG Exam Scheduled From Sept 12.నీట్ ప‌రీక్ష 2021ను వాయిదా వేయాల‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2021 10:02 AM GMT
ఆదివార‌మే నీట్ ప‌రీక్ష‌.. వాయిదా వేయ‌డం కుద‌ర‌దు

నీట్ ప‌రీక్ష 2021ను వాయిదా వేయాల‌ని కొంద‌రు విద్యార్థులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను సోమ‌వారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌డం కుద‌ర‌ని.. షెడ్యూల్ ప్ర‌కార‌మే నీట్ పరీక్ష జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో సెప్టెంబ‌రు 12న నీట్ ప‌రీక్ష య‌థావిధిగా జ‌ర‌గ‌నుంది.

నీట్ ప‌రీక్ష జ‌రిగే రోజున ఇత‌ర పోటీ ప‌రీక్ష‌లు ఉన్నాయ‌ని, సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ కొంద‌రు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. దీనిపై దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందించింది. ఈ పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. 16ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ను రాయ‌నున్నార‌ని.. కేవ‌లం కొద్ది మంది విద్యార్థుల కోసం ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌లేమ‌ని చెప్పింది. 'ఈ పిటిషన్‌ను మేం ఆమోదించలేం. అనిశ్చితి వద్దని మేం కోరుకుంటున్నాం. పరీక్షను కొనసాగిస్తున్నాం.' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా.. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా ఈ ఏడాది నీట్ ప‌రీక్ష ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది. మేలో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ను కేంద్రం ర‌ద్దు చేసింది. ఆగ‌స్టు 1 నిర్వ‌హిస్తామ‌ని ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్ర‌క‌టించింది. అయితే.. అప్ప‌టికి కూడా క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుండ‌డంతో.. సెప్టెంబ‌ర్ 12కు వాయిదా వేశారు. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాల్లో ప్ర‌వేశాల కోసం నీట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. మొత్తం 13 భాష‌ల్లో పెన్ అండ్ పేప‌ర్ ప‌ద్ద‌తిలో ఈ ఎగ్జామ్ ను నిర్వ‌హిస్తారు.

Next Story