SBI రిపోర్ట్.. కరోనా సెకండ్ వేవ్ 100రోజులు.. ఏప్రిల్లో ఉగ్రరూపం
SBI Report says india's second covid wave may last up to 100 days.కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల పాటు ఉండొచ్చుననని.. ఏప్రిల్ 15 తరువాత ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తన నివేదికలో వెల్లడించింది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2021 6:35 PM IST
భారత్లో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రిపోర్టు వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ 100 రోజుల పాటు ఉండొచ్చుననని.. ఏప్రిల్ 15 తరువాత ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తన నివేదికలో వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచే ఈ సెకండ్ వేవ్ ప్రారంభమైందని తెలిపింది. గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్న కేసుల ట్రెండ్ను బట్టి చూస్తే దేశ వ్యాప్తంగా దాదాపు 25లక్షల మంది ఈ సెకండ్ వేవ్లో వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
కరోనా సెకండ్ వేవ్కు అడ్డుకట్ట వేయడానికి స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్లు, ఆంక్షలు అంత ప్రభావం చూపించడం లేదని ఈ 28 పేజీల నివేదిక స్పష్టం చేసింది. కరోనా కట్టడి చేయాలంటే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడమే ఏకైక మార్గమని స్పష్టం చేసింది. పెరుగుతున్న కేసుల వల్ల దేశంలో కొన్ని రంగాలు ఆర్థికంగా క్షీణించాయని.. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్, ఆంక్షలు విధించడం వల్ల మరిన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని.. దీనిపై వచ్చే నెలలో మరింత స్పష్టత వస్తుందని ఎస్బీఐ తన నివేదికలో చెప్పింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 34 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తుండగా.. దీనిని కనీసం 40-45 లక్షలకు పెంచాలని చెప్పింది. అలా చేస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి 4 నెలల సమయం పట్టనుంది.
50 వేలు దాటిన కరోనా కేసులు..
రోజు రోజుకు దేశంలో నమోదు అవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10.63లక్షల కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 53,476 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్లో వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల 1,17,87,534కి చేరింది. నిన్న ఒక్క రోజే 26,490 మంది కోలుకోగా.. మొత్తంగా ఈ మహమ్మారి బారి నుంచి బయట పడిన వారి సంఖ్య 1,12,31,650కి చేరింది. ఒక్క రోజులోనే 251 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,60,692కి చేరింది. గడిచిన 24 గంటల్లో 23.03లక్షల మందికి కరోనా టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 5,31,45,709కి చేరింది.