బీహార్లోని జెహానాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత 'జలేబీ' కోసం గొడవ జరిగిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గొడవతో పరిస్థితి హింసాత్మక స్థాయికి చేరుకుంది. ఏకంగా కర్రలు, లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పంచాయతీ చీఫ్ తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవలసి వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత కొంతమంది జిలేబీలు దొంగిలించి పారిపోవడంతో ఈ వివాదం అంతా మొదలైంది.
పసర్బిఘా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గోన్వాన్ పంచాయతీ భవన్లో ఈ సంఘటన జరిగింది. పంచాయతీ చీఫ్ అమర్నాథ్ సింగ్ పంచాయతీ భవన్లో జెండాను ఎగురవేసినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామాధికారి ఒక క్వింటాలు జిలేబీని ఏర్పాటు చేశాడు. ఇంతలో పంచాయతీలోని కొంతమంది దుండగులు జిలేబీలతో తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీనితో పెద్ద గొడవ జరిగింది.
వేడుక తర్వాత గ్రామస్తులకు ఒక క్వింటాల్ జిలేబీని పంపిణీ చేయాలని చీఫ్ ఆదేశించినట్లు సమాచారం. జెండా ఎగురవేసిన వెంటనే.. కొంతమంది జిలేబీతో పారిపోవడం ప్రారంభించారు. చీఫ్ మద్దతుదారులు వారిని ఆపడానికి ప్రయత్నించగా.. పరిస్థితులు అకస్మాత్తుగా హింసాత్మకంగా మారాయి. దీంతో గ్రామస్తులు కర్రలు, రాడ్లు, ఇటుకలతో ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. పరిస్థితి ఎంత దిగజారిందంటే.. గ్రామ పెద్ద అమర్నాథ్ సింగ్ తన ప్రాణాలు చేత పట్టుకుని పారిపోవాల్సి వచ్చింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామస్తులు ఎలా గొడవపడుతున్నారో ఈ వీడియో చూపిస్తుంది. హింసాత్మక ఘర్షణలో పంచాయతీ భవన్ ప్రాంగణంలో పార్క్ చేసిన నాలుగు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. జెండా ఎగురవేత కార్యక్రమం తర్వాత జిలేబీ (స్వీట్లు) విషయంలో జరిగిన వివాదం తర్వాత.. నన్ను చంపాలనే ఉద్దేశ్యంతో నాపై దాడి చేశారని చీఫ్ అమర్నాథ్ సింగ్ ఆరోపించారు.