తప్పుడు అత్యాచారం కేసు: యువకుడికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు సంచలన తీర్పు

Rep case.. Chennai Court Sensational Judgments .. తప్పుడు కేసు పెట్టినందుకు ఓ యువకుడికి కోర్టు దిమ్మదిరిగే షాకిచ్చింది.

By సుభాష్  Published on  22 Nov 2020 5:53 AM GMT
తప్పుడు అత్యాచారం కేసు: యువకుడికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు సంచలన తీర్పు

చెన్నై: తప్పుడు కేసు పెట్టినందుకు ఓ యువకుడికి కోర్టు దిమ్మదిరిగే షాకిచ్చింది. తప్పుడు కేసులు పెడుతూ న్యాయస్థానం విలువలు, సమయాన్ని వృథా చేయడం కూడా ఒక నేరమే. అలాగే రేప్‌ జరిగిందంటూ తప్పుడు కేసు పెట్టడం కూడా నేరమే. ఓ కుటుంబం మా అమ్మాయిని ఓ అబ్బాయి అత్యాచారం చేశాడంటూ పెట్టిన కేసు వారికి నేరంగా మారిపోయింది. అత్యాచారం జరిగిందంటూ తప్పుడు కేసు పెట్టిన ఓ యువతి కుటుంబానికి చెన్నై కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. తప్పుడు కేసు పెట్టినందుకు సదరు అబ్బాయికి అమ్మాయి కుటుంబం రూ.15 లక్షలు పరిహారం ఇవ్వవాలని తీర్పునిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సంతోష్‌ అనే యువకుడు ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. వారి ఇంటి పక్కనే ఓ యువతి కుటుంబం నివసిస్తోంది. సంతోష్‌ కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబం కలిసిమెలసి ఉండేది. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సంతోష్‌తో ఆ యువతికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అనుకునేవారు. దీంతో సంతోష్‌, ఆ అమ్మాయి కూడా చనువుగా ఉంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకునేవారు.

ఇలా కలిసిమెలసి ఉంటున్న ఆ కుటుంబాల మధ్య ఇచ్చుపుచ్చుకునే ఆస్తి వివాదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరికి పెళ్లి చేసే విషయంలో విబేధాలు ఏర్పడ్డాయి. ఇక సంతోష్‌ కుటుంబం వేరే చోటుకు మకాం మార్చి జీవిస్తోంది. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాల్చింది. దీంతో సంతోష్‌ తమ కుమార్తెను లొంగదీసుకున్నాడని, ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోషే కారణమంటూ ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబం డిమాండ్‌ చేసింది. మీ అమ్మాయికి వచ్చిన గర్భంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎప్పుడు అటువంటి సంబంధం పెట్టుకోలేదని సంతోష్‌ తేల్చి చెప్పాడు. కానీ యవతి తల్లిదండ్రులు అంగీకరించకుండా అతనిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో 2009 నవంబర్‌లో సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 90 రోజుల తర్వాత జ్యుడీషియల్‌ కస్టడిలో పెట్టారు. ఆ తర్వాత 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈలోగా అతనిపై కేసు పెట్టిన యువతికి నెలలు నిండాయి. ఓ పాపకు జన్మనిచ్చింది. అలాగే కోర్టులో కేసు కొనసాగుతోంది.

దీంతో ఆ పాప సంతోష్‌ వల్లనే పుట్టిందా..? లేదా.. అని నిర్ధారించేందుకు ఆ శిశువుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా, సంతోష్‌ ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. అయినా ఈ కేసు అలా కొనసాగి 2016 ఫిబవరిలో నిదోషిగా తేల్చింది చైన్నై కోర్టు. అనంతరం తనపై అన్యాయంగా కేసు పెట్టి నా జీవితం నాశనం చేశారని ఆ యువకుడు పరువు నష్టం దావా వేశాడు. తనకు రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం.. తాజాగా సంచలన తీర్పునిచ్చింది. సదరు యువతి కుటుంబం సంతోష్‌ను, అతని కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసిందని, అందుకు పరిహారంగా పరువు తీసినందుకు పరిహారంగానూ రూ.15 లక్షలు చెల్లించాలని ఆ యువతి కుటుంబాన్ని ఆదేశించింది. చేసేదేమి లేక ఆ యువతి కుటుంబం ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఏదీఏమైనా ఓ తప్పుడు కేసు వల్ల ఆ యువకుని కుటుంబం ఎన్నో బాధలు అనుభవించింది. ఇక చివరికి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Next Story