నేడు G-7 శిఖరాగ్ర సమావేశాలు.. వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొన‌నున్న‌ మోదీ

PM Modi to Virtually Attend Outreach Sessions of G7 Summit.బ్రిట‌న్ వేదిక‌గా నేటి(శుక్ర‌వారం) నుంచి జీ-7

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 5:06 AM GMT
నేడు G-7 శిఖరాగ్ర సమావేశాలు.. వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొన‌నున్న‌ మోదీ

బ్రిట‌న్ వేదిక‌గా నేటి(శుక్ర‌వారం) నుంచి జీ-7 శిఖ‌రాగ్ర స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. జీ-7లో స‌భ్య‌దేశాలుగా బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడా, జ‌ర్మ‌నీ ఉన్నాయి. ఈ స‌భ్య‌దేశాల‌కు చెందిన అధినేత‌లు ఈ స‌మావేశంలో పాల్గొన‌బోతున్నారు. ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథ్య దేశమైన బ్రిటన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచింది. ఈ ఏడాది జీ7 సమ్మిట్‌ 'బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ (తిరిగి గొప్పగా నిర్మించుకుందాం)' థీమ్‌తో జరుగనుంది.

కరోనా నుంచి ప్రపంచం మొత్తం బయటపడడమే కాకుండా భవిష్యత్తులో దాడి చేయబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండడం అందులో మొదటిది కాగా.. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం రెండోది. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొంటూ భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడడం మూడోది కాగా.. భాగస్వామ్య విలువలను రక్షించుకుంటూ స్వేచ్ఛాయుత సమాజాన్ని నెలకొల్పడం నాలుగో నినాదంగా బ్రిటన్ పేర్కొంది.

అయితే.. భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా ప్ర‌ధాని మోదీ బ్రిట‌న్ వెళ్ల‌డం లేద‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శ‌ని, ఆదివారం జ‌రిగే స‌మావేశాల్లో నేరుగా కాకుండా వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొంటార‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ వెల్ల‌డించింది.

Next Story