తెల్ల‌వారుజామున బీజేపీ కార్యాల‌యంపై పెట్రోల్ బాంబు దాడి

Petrol Bomb Allegedly Thrown At BJP's Office In Tamil Nadu.త‌మిళ‌నాడు రాష్ట్రం చైన్నై ప‌ట్ట‌ణంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2022 2:50 AM GMT
తెల్ల‌వారుజామున బీజేపీ కార్యాల‌యంపై పెట్రోల్ బాంబు దాడి

త‌మిళ‌నాడు రాష్ట్రం చైన్నై ప‌ట్ట‌ణంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) కార్యాల‌యంపై దాడి జ‌రిగింది. ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై వ‌చ్చిన గుర్తు తెలియ‌ని దుండ‌గులు పెట్రోల్ బాంబులు విసిరారు. గురువారం తెల్ల‌వారుజామున 1 గంట స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాత్రి స‌మ‌యం కావ‌డంతో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. పాక్షికంగా కార్యాల‌యం దెబ్బ‌తింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డి చేరుకున్నారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా చెన్నైలోని నంద‌నం ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. నిందితుడిని వినోద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై బీజీపీ నేత క‌రాటే త్యాగ‌రాజ‌న్ స్పందించారు. 'మా (బీజేపీ) కార్యాల‌యంపై తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు పెట్రోల్ బాంబు విసిరారు. రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. 15 సంవ‌త్స‌రాల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగింది. ఈ ఘ‌ట‌న వెన‌క ప్ర‌భుత్వ హ‌స్తం ఉంది. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేం పోలీసుల‌కు కూడా స‌మాచారం ఇచ్చాం. ఇలాంటి వాటికి బీజేపీ క్యాడ‌ర్ భ‌య‌ప‌డ‌దు' అని త్యారాజ‌న్ చెప్పారు.

Next Story