నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Parliament Session Begins Today.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2022 10:19 AM IST
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 29 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ పాత భవనంలోనే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇది 17వ లోక్సభకు 10వ సెషన్ కానుండగా, ఎగువ సభ అంటే రాజ్యసభకు ఇది 258వ సెషన్గా నిలవనుంది. ఈ సమావేశాల్లో 16 కొత్త బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది.
మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, నేషనల్ డెంటల్ కమిషన్, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, కంటోన్మెంట్, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ, నార్త్ ఈస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, ట్రేడ్ మార్క్స్, వస్తువుల భౌగోళిక సూచనలు,కళాక్షేత్ర ఫౌండేషన్, పాత గ్రాంట్, వంటి బిల్లులు ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, ఎగిసిన ధరలు, పంటలకు కనీసం మద్దతు ధరకు చట్టబద్దత వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీసేందుకు ప్రతి పక్షాలు సిద్దం అయ్యాయి. ఇక పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై భావసారూప్యం కలిగిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజసభా పక్ష నేత మల్లికార్జున ఖర్జే చాంబర్లో సమావేశం కానున్నాయి.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని టీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలతో కలిసి అంశాలపై పోరాడతామని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.