ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు వచ్చిన రెండో విమానం

ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్‌ నుంచి రెండో విమానం భారత్‌కు చేరుకుంది. 235 మంది స్వదేశీయులు ఢిల్లీ చేరుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  14 Oct 2023 4:49 AM GMT
operation ajay,  israel, second flight,  delhi,

ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు వచ్చిన రెండో విమానం

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముందుగా ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ కూడా యుద్ధానికి దిగింది. ఇరుపక్షాల నుంచి రాకెట్‌ దాడులు, బాంబుల మోత కొనసాగుతోంది. ఇరు దేశాల్లో కలిపి దాదాపు 3200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసిన శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. కారుల్లో.. రోడ్లు.. కూలిన భవనాలు ఇలా ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఆ ఆపరేషన్‌కు అజయ్‌ అని పేరు పెట్టింది. ఇప్పటికే ఒక విమానం భారత్‌ చేరుకుంది. తాజాగా మరో విమానం ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది.

ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో విమానం 235 మంది భారతీయులతో ఢిల్లీ చేరుకుంది. అయితే.. ఆపరేషన్‌ అజయ్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొలి విమానం 212 మంది భారతీయులను శుక్రవారమే వచ్చింది. అయితే.. ఈ ఆపరేషన్‌ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్‌ ద్వారా భారత్‌కు క్షేమంగా చేరుకుంటున్న బాధితులు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు క్షేమంగా ఇంటికి వస్తుండటం ఆనందంగా ఉందని బాధితుల కుటుంబీకులు అంటున్నారు.

అయితే.. ఇజ్రాయెల్‌లో భారత్‌కు చెందిన వారు దాదాపు 18వేల మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే.. ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా మొదటగా రిజస్టర్‌ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు అధికారులు. రెండో విమానం శుక్రవారం రాత్రి 11.02 గంటలకు ఢిల్లీ చేరుకుంది. ఆపరేషన్ అజయ్‌ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎంబసీలో రిజస్టర్‌ చేసుకున్నవారికి ఈమెయిల్స్‌ ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ నుంచి ఇవాళ భారత్‌కు మరో విమానం రానుంది. అయితే.. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌ వైపు 1300కి పైగా మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం భీకరంగా కొనసాగుతోంది.

Next Story