వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా, భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు...
By - అంజి |
వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా, భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని NHAI యోచిస్తోంది.
1,150 టోల్ ప్లాజాలు ఆన్లైన్ కానున్నాయి
ఒకవేళ ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దేశంలోని 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల వద్ద టోల్ చెల్లింపులు కేవలం FASTag, UPI వంటి డిజిటల్ విధానాల ద్వారా మాత్రమే జరుగుతాయి.
డిజిటల్ విధానంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) ద్వారా ఇప్పటికే సాధించిన ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడం, టోల్ ప్లాజాల వద్ద పారదర్శకతను పెంచడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. నగదు రహిత వ్యవస్థ వల్ల టోల్ లేన్లలో వాహనాల రాకపోకలు వేగవంతం అవుతాయని, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, ప్రయాణికులకు 'సులభతర ప్రయాణం' (Ease of Commuting) సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
98 శాతానికి చేరిన ఫాస్టాగ్ వినియోగం
గత కొన్నేళ్లుగా RFID ఆధారిత ఫాస్టాగ్ వ్యవస్థ టోల్ వసూళ్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రస్తుతం 98 శాతానికి పైగా టోల్ లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. ఫాస్టాగ్తో పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా యూపీఐ (UPI) ద్వారా కూడా తక్షణ చెల్లింపు సౌకర్యాలను NHAI కల్పించింది.
నగదు రూపంలో చెల్లిస్తే జరిమానా భారం
ప్రస్తుత నిబంధనల ప్రకారం, చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలోకి ప్రవేశించి నగదు చెల్లించే వాహనదారులు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, యూపీఐ ద్వారా చెల్లించే వారు ప్రామాణిక రుసుము కంటే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాలి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు.
నగదు చెల్లింపులతోనే జాప్యం
క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, నగదు లావాదేవీల వల్ల వాహనాలు ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తోంది. దీనివల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, చిల్లర విషయంలో వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నగదును పూర్తిగా రద్దు చేయడం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.