వందేమాతరంపై కేంద్రం కీలక గైడ్లైన్స్
జాతీయ గేయం 'వందేమాతరం' గౌరవార్థం కేంద్ర హోం శాఖ బుధవారం సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
By - అంజి |
వందేమాతరంపై కేంద్రం కీలక గైడ్లైన్స్
జాతీయ గేయం 'వందేమాతరం' గౌరవార్థం కేంద్ర హోం శాఖ బుధవారం సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక ఉత్సవాల్లో వందేమాతరాన్ని ఎలా ఆలపించాలి, ప్రేక్షకులు ఎలా ప్రవర్తించాలనే అంశాలపై స్పష్టమైన ప్రోటోకాల్ను ప్రభుత్వం ఖరారు చేసింది. వందేమాతరం పూర్తి అధికారిక వెర్షన్ ఆరు చరణాలను కలిగి ఉంటుంది. దీనిని ఆలపించడానికి సుమారు 3 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. ప్రధాన రాష్ట్ర కార్యక్రమాల్లో ఈ పూర్తి వెర్షన్నే ఉపయోగించాలని కేంద్రం విడుదల చేసిన గైడ్లైన్స్లో ఉంది.
ఏదైనా కార్యక్రమంలో జాతీయ గేయం (వందేమాతరం), జాతీయ గీతం (జనగణమన) రెండూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా వందేమాతరాన్ని మొదట ఆలపించాలి, ఆ తర్వాతే జాతీయ గీతాన్ని పాడాలి. వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు ప్రేక్షకులందరూ గౌరవ సూచకంగా 'అటెన్షన్' లో నిలబడాలి. జాతీయ జెండా ఆవిష్కరణ, రాష్ట్రపతి, గవర్నర్ల రాక, నిష్క్రమణ సమయాల్లో, వారి ప్రసంగాలకు ముందు మరియు తర్వాత వందేమాతరం ఆలపించాలి. బ్యాండ్ ద్వారా వందేమాతరం వాయిస్తున్నప్పుడు, అది ప్రారంభం కాబోతుందని తెలియజేయడానికి 'డ్రమ్ రోల్' లేదా 'బ్యూగిల్ కాల్' తప్పనిసరి అని కేంద్రం తెలిపింది.
విద్యార్థుల్లో దేశభక్తిని మరియు జాతీయ చిహ్నాలపై గౌరవాన్ని పెంచడానికి ప్రతిరోజూ పాఠశాల అసెంబ్లీలో వందేమాతరం పాడాలని కేంద్రం సూచించింది. సినిమాల్లో భాగంగా లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వందేమాతరం వినిపించినప్పుడు ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. వినోద ప్రదేశాలలో నిలబడటం వల్ల ఇబ్బందులు కలగకుండా ఈ మినహాయింపు ఇచ్చారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం రావడం విశేషం. జాతీయ గీతానికి ఉన్న తరహాలోనే వందేమాతరానికి కూడా అధికారిక ప్రోటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు తెచ్చారు.