1998లో జరిగిన ఓ దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించగా.. ప్రస్తుతం ఆయన పాటియాలలోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జైలు అధికారులు సిద్ధూకు ఖైదీ నెంబర్ 241383 ఇచ్చారు. బ్యారక్ నెంబర్ 7లో ఉంచారు. కాగా.. శిక్షా కాలంలో ఆయన జైలులో క్లర్క్గా పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సాధారణంగా కారాగార శిక్ష పడిన ఖైదీలకు జైలులో పనులు అప్పగిస్తారు. అందులో భాగంగానే సిద్దూకు క్లరికల్ వర్క్ను అప్పగించినట్లు జైలు అధికారులు తెలిపారు. క్లర్క్గా ఆయన ఏ పని చేయాలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సిద్ధూ పూర్తి స్థాయిలో ఆ పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా అతను సెల్ నుంచే పనిచేయనున్నారు. సిద్ధూ ఉన్న గదికే ఫైళ్లను పంపనున్నారు. సిద్దూ రోజుకు రెండు షిష్టుల్లో (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నాం 3 నుంచి 5 వరకు) పనిచేయనున్నారు. తొలి మూడు నెలల పాటు ఎటువంటి జీతం చెల్లించరు. ఆ తర్వాత రోజుకు రూ.90 వరకు ఇస్తారు. ఆ వేతనాన్ని అతని బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనున్నారు.