పుణ్యానికి పొతే ఆ పోలీసులకు ఏం ఎదురయ్యిందో తెలుసా?

Nagpur cops rescue 15 critical Covid patients.15మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడటం కోసం రిస్క్ తీసుకున్నారు, కానీ చిక్కుల్లో ఇరుక్కున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 1:50 AM GMT
cops rescue covid patients

ఒక్కోసారి మనం మంచే చేద్దాం అనుకుంటాం.. కానీ అది ముంచేస్తుంది.. అలాగే పాపం నాగపూర్ పోలీసులు కూడా ఒక మంచి పని చేసి ప్రాణాలు కాపాడదాం అనుకున్నారు. కానీ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు 15మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడటం కోసం రిస్క్ తీసుకున్నారు, వారికి తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కున్నారు .. అదేంటీ రోగుల ప్రాణాలు కాపాడితే ప్రశంసించాలి గానీ కేసులు పెట్టటమేంటీ అనుకుంటున్నారా.. . ఎందుకంటే పోలీసులు కరోనా పేషెంట్లకోసం తీసుకొచ్చిన ఆక్సిజన్ సిలిండర్లు బెదిరించి తీసుకొచ్చారని ఉన్నతాధికారులు వారిపై కేసులు నమోదు చేసారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఏప్రిల్ 18, ఆదివారం రాత్రి జరిపట్కలోని తిరుపూడి ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిపట్క పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని..కానీ ఆస్పత్రిలో 15మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించాల్సి ఉందని తెలిపారు. పేషెంట్ల కోసం కనీసం 10 సిలిండర్లయినా కావాలని పోలీసులను కోరారు. దీంతో వెంటనే స్టేషన్ లో ఆ సమయంలో డ్యూటీ చేస్తున్న ఎస్సై మహాదేవ్ నాయక్ వాదె.. తన సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కు వెళ్లారు. కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కావాలని వెంటనే ఇవ్వాలని కోరారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాలంటే పర్మిషన్ లెటర్ ఇవ్వాలని ప్లాంట్ యజమాని తేల్చి చెప్పారు. కానీ ఆస్పత్రిలో రోగులు ప్రమాదంలో ఉన్నారని..వారికి ఆక్సిజన్ అందించకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఆస్పత్రి సిబ్బంది తెలిపారని, మానవతా దృక్పధం తో, పరిస్థితి అర్థం చేసుకుని సిలిండర్లు ఇవ్వాలని మరోసారి అడిగారు ఎస్సై మహాదేవ్.

దీంతో..పరిస్థితి అర్థం చేసుకున్న అతను ఏడు సిలిండర్లను అందించాడు. ఆ సిలిండర్లను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు ఎస్సై మహాదేవ్ తన సిబ్బందితో సహా. పరిస్థితి విషమంగా ఉన్న 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించారు. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందితో సహా పోలీసులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. సమయానికి స్పందించి అర్థరాత్రి ఆక్సిజన్ సిలిండర్లు అందించిన పోలీసులను ప్రశంసించాల్సింది పోయి ఉన్నతాధికారులు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చిన పోలీసులపై కేసులు నమోదు చేసారు. ఆక్సిజన్ ప్లాంట్ యజమానులను బెదిరించి సిలిండర్లను తీసుకొచ్చారనే ఆరోపణలతో ఎస్సై మహాదేవ్ తో సహా అతనితో పాటు వెళ్లిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేషంట్ ల ప్రాణాలు కాపాడటం ఏమో గానీ ఇప్పుడు మా ప్రాణాలమీదకి వచ్చిందని తల పట్టుకు కూర్చున్నారు పోలీసులు.


Next Story