దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక మహారాష్ట్రలో నిత్యం 60 వేలకు పైగా కేసులు వస్తున్నాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఆస్పత్రి కరోనా పేషంట్లతో నిండిపోతున్నాయి. ఇక వారికి వైద్యాన్ని అందించే డాక్టర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 18 వేల మంది డాక్టర్లకు కరోనా సోకగా.. వారిలో 168 మంది మృతి చెందారు.
ముంబైలో ఇటీవల డాక్టర్ మనీషా జాదవ్ కరోనా బారిన పడింది. ఆ మహమ్మారితో పోరాడుతూ.. చివరికి కన్నుమూసింది. అయితే.. తాను చనిపోతాను అనే సంగతిని ఆమె ముందే ఊహించింది. ఆమె చనిపోవడానికి ఒక రోజు ముందు అంటే.. ఏప్రిల్ 18న ఆదివారం.. ఆమె పేస్బుక్ లో ఆకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇదే నా చివరి శుభోదయం కావొచ్చు. నేను శారీరకంగా చనిపోవచ్చు.. కానీ ఆత్మ సజీవంగా ఉంటుందంటూ 'పోస్ట్ చేసింది. ఆ మరుసటి రోజే అంటే.. ఏప్రిల్ 19న సోమవారం ఆమె ప్రాణాలు కోల్పోయింది. 51 ఏళ్ల మనీషా జాదవ్.. సెవ్రీ టీబీ హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్.
మనీషా జాదవ్ చాలా చురుకైన వారు. క్లినికల్, అడ్మినిస్ట్రేటివ్ విధులు రెండూ నిర్వహించేవారు. ముంబైలో ఏర్పాటు చేసిన సివిక్ హెల్త్ సెటప్లో ప్రాణాలు కోల్పోయిన తొలి డాక్టర్ ఆమె.