విషాదం.. కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతి.. ఓ పసికందు మృతి
Monkey take away infant twins in Thanjavur.తమిళనాడు తంజావూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది.కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతి.. ఓ పసికందు మృతి
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2021 10:18 AM GMTతమిళనాడు తంజావూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కోతి ఆకస్మాత్తుగా ఇంట్లో చొరబడి ఇద్దరు పసికందుల్ని ఎత్తుకెళ్లింది. స్పందించిన గ్రామస్తులు ఓ చిన్నారిని కాపాడగా.. ఎనిమిది రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తంజావురు జిల్లా కేంద్రంలో గల రాంపూర్ రోడ్డు ప్రాంతంలో రాజు, భువనేశ్వరీ దంపతులు నివాసం ఉంటున్నారు. రాజు పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఓ కుమారై ఉంది.
గతవారం భువనేశ్వరీ కవలల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే.. శనివారం(పిబ్రవరి 13) పిల్లలని ఇంట్లో ఉంచి బయట పని చేసుకుంటూ ఉంది. ఆ సమయంలో ఓ కోతి.. ఇంటిపై కప్పు పగల కొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. మొదట ఓ చిన్నారిని తీసుకెళ్లి గోడపై ఉంచింది. మళ్లీ వచ్చి రెండో చిన్నారిని తీసుకెళ్తుండగా భువనేశ్వరీ చూసి గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు కోతి చేతిలో ఉన్న పాపను రక్షించారు. ఆలోపు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతైన పాప కోసం గాలించారు. చివరికి ఇంటి వెనకాల ఉన్న కందకంలో స్పృహా కోల్పోయి కనిపించింది.
వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన శిశువు శరీరంపై కోతులు దాడి చేసినట్లుగానీ, గాయాల ఆనవాళ్లు గానీ లేవని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే.. పిల్లలు పుట్టి కేవలం 8 రోజులే అవుతున్నందున ఎత్తుకెళ్లిన సమయంలో శిశివు కీళ్లు తొలగిపోయి ఉంటాయని.. నీటిలో పడేసిన తరువాత ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని.. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అయితే.. కోతులు పైకప్పు పెంకులను తొలగించి, ఇంట్లోకి దూరి పిల్లలను ఎత్తుకుని, మళ్లీ ఆ రంధ్రంలో నుంచే వెళ్లడం అసాధ్యమని తంజావూర్ ఫారెస్ట్ రేంజర్ జి. జోతికుమార్ పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తమవుతోంది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతో వారు ఈ నాటకమాడుతున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.