'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, హైస్పీడ్ రైలులో ప్రయాణం

దేశంలో తొలి ప్రాతీయ సెమీ హైస్పీడ్‌ రైలు పట్టాలెక్కింది. 'నమో భారత్' రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 7:31 AM GMT
modi,  namo bharat, high speed train, uttar pradesh,

'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, హైస్పీడ్ రైలులో ప్రయాణం

దేశంలో తొలి ప్రాతీయ సెమీ హైస్పీడ్‌ రైలు పట్టాలెక్కింది. ఈ 'నమో భారత్' రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సాహిబాబాద్ స్టేషన్‌లో ఢిల్లీ-గాజియాబాద్‌-మేరఠ్‌ రీజనల్ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌ను ప్రధాని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు (నమో భారత్) పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ గవర్నర్‌తో పాటు సీఎం యోగి, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ సహా పలువురు పాల్గొన్నారు. అయితే.. నమో భారత్ రైలును ప్రారంభించిన తర్వాత అదే ట్రైన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. స్కూల్‌ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్‌ రైలు సిబ్బందితో మోదీ కాసేపు ముచ్చటించారు.

ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా అధికారులు రూపొందించారు. అలాగే దీంట్లో అధునాతన సదుపాయాలు కల్పించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మేరఠ్ మధ్య రూ.30వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. సాహిబాబాద్-దుహై డిపో మధ్య ముందుగా 17 కిలోమీటర్ల దూరానికి ఈ రైలు రాకపోకలు కొనసాగిస్తుంది. ఈ రెండింటి మధ్య ఐదు స్టేషన్లు ఉంటాయి. నమో భారత్‌ రైలులో అన్నీ ఏసీ పెట్టే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలు సీట్లు ఉంటాయి. అంతేకాదు నిలబడి ప్రయాణించేందుకు కూడా విశాలమైన ప్రదేశం ఉంటుంది. సామాన్లు ఉంచుకునేందుకు అరలు.. భద్రత కోసం సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పాయింట్లు, రూట్‌ మ్యాప్‌లు.. దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థలు ఈ నమో భారత్‌ రైలులో ఉన్నాయి.

నమో భారత్ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు. ప్రీమియం కోచ్‌లలో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లు ఉంటాయి.

Next Story